ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ..: ఎంపీ సంచలన వీడియో

national |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 09:18 PM

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరెంతో గాయపడ్డారు. ఈక్రమంలోనే పోలీసులు హింసకు పాల్పడ్డ 118 మందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గొడవలు ఆపాలని ప్రజలకు నచ్చజెప్పాల్సింది పోయి ఓ ఎంపీ గొడవలను మరింత ఎక్కువ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తృణమూల్ ఎంపీ బాపి హల్దార్ వక్ఫ్ ఆస్తులను ఎవరైన ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే.. కాళ్లూ చేతులు విరిచి, కళ్లు పీకేస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఎంపీ ఇలా మాట్లాడడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.


వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడానికి ఏమాత్రం వీళ్లేదంటూ పశ్చిమ్ బెంగాల్‌లో మొదలైన నిరసనలు హింసకు దారితీశాయి. ముఖ్యంగా ఆదివారం రోజు బెంగాల్‌ జిల్లాల్లో హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి గొడవలు జరుగుతున్న సమయంలో ప్రజలను శాంతింప జేయాల్సిన పదవిలో ఉన్న ఓ ఎంపీ.. దారుణంగా మాట్లాడారు. ముగ్గురు మనుషులు చనిపోయినా పట్టించుకోకుండా.. వారిని మరింత రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేశారు. దీంతో వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ ఎంపీ మరెవరో కాదు.. తృణమూల్ లోక్ సభ సభ్యుడు బాపి హల్దార్.


అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాపి హల్దార్.. వక్ఫ్ ఆస్తులను ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వారిని కాళ్లూ చేతులు విరిచేస్తానని చెప్పారు. అంతేకాకుండా వారి కళ్లు కూడా పీకేస్తానని.. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా చూస్తానని వ్యాఖ్యానించారు. ఈయన ఇలా మాట్లాడుతున్న మసయంలోనే అనేక మంది వీడియోలు తీశారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. మంత్రి ఇంత తీవ్రంగా మాట్లాడడంతో.. వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంపీ చేసిన ఈ కామెంట్ల వీడియోను షేర్ చేస్తూ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారనే నెపంతో.. మతోన్మాద, ఛాందసవాద జిహాదీ గ్రూపులు హిందువుల ఉనికిని తుడిచి పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయన్నారు. అలాగే జవాన్లపై పెట్రోల్ బాంబులు కూడా విసురుతున్నాయని చెప్పుకొచ్చారు. వారికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు. బెంగాల్‌లోని అమాయక హిందువులకు అక్కడ జరుగుతున్నదంతా తెలుసంటూనే.. ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com