ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి,,,,ఐదో టెస్ట్‌లో అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 10:42 PM

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచులో గెలవడం ఇంగ్లాండ్‌కు ముఖ్యం. ఇదే సమయంలో సిరీస్‌ను డ్రా చేయాలంటే టీమిండియా తప్పకుండా గెలవాల్సిందే. ఇలాంటి మ్యాచులో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య ఆధిపత్యం దోబూచులాడుతున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.


ఈ సిరీస్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి రెండు టెస్టు మ్యాచులలో ఆడిన అతడు.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే తరహాలో పరుగులు ఇస్తూ.. విమర్శల పాలయ్యాడు. దీంతో అతడిని మూడు, నాలుగో టెస్టు నుంచి పక్కనపెట్టింది మేనేజ్‌మెంట్. కానీ అనూహ్యంగా ఐదో టెస్టు మ్యాచు తుది జట్టులోకి వచ్చిన అతడు.. అదిరే ప్రదర్శన చేస్తున్నాడు.


వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేశాడు. 57 బంతుల్లో 64 రన్స్ చేసి.. ప్రమాదకరంగా మారిన అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఇక రెండో రోజు రెండో సెషన్‌లు అదరగొట్టాడు. టీ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత జెమీ స్మిత్ (8), ఆ తర్వాత జెమీ ఓవర్టన్ (0)ను ఔట్ చేశాడు. దీంతో రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్.. ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించడం గమనార్హం. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేస్తున్నారు.


మహమ్మద్ సిరాజ్ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బంది పెడుతున్నాడు. రెండో రోజు రెండో సెషన్ ముగిసే సరికి.. సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఓలీ పోప్, జో రూట్, జాకబ్ బెథెల్‌లను ఔట్ చేశాడు. ఆకాశ్ దీప్ సైతం ఒక వికెట్ తీశాడు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి.. సిరీస్ ఫలితం తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa