ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢీ అంటే ఢీ అంటున్న ఇంగ్లండ్ బ్యాటర్లు - హీటు పుట్టిస్తున్న ఓవల్ టెస్టు

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 10:44 PM

అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ది ఓవల్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు - భారత్ బౌలర్లు సై అంటే సై అంటున్నారు. పేస్ పిచ్‌పై బాజ్ బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు టీమిండియా బౌలర్లను ఉతికారేశారు. బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆరంభంలో బౌండరీల మోత మోగించారు. ఆ క్రమంలోనే ఇంగ్లండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య హీట్ కాన్వర్జేషన్‌తో మ్యాచ్ రసవత్తరంగా మారింది.


ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ 90 శాతం పరుగులు బౌండరీల రూపంలోనే రాబట్టారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెన్ డకెట్, ఆకాశ్ దీప్ మధ్య కొంచెం మాటల యుద్ధం జరిగింది. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో సిక్సర్ బాదిన డకెట్.. నన్ను నువ్వు అవుట్ చేయలేవు అంటూ రెచ్చగొట్టాడు. హిట్టింగ్‌తో విరుచుకుపడిన డకెట్.. ఆకాశ్ దీప్ బౌలింగ్ బ్యాట్ తిప్పి ఆడేందుకు ప్రయత్నించి కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


కరుణ్ నాయర్ ది రియల్ జెంటిల్‌మెన్.. వోక్స్ గాయం సమయంలో క్రికెట్ స్పిరిట్ చూయించిన భారత బ్యాటర్!


బెన్ డకెట్ అవుటవ్వడంతో ఆకాశ్ దీప్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తున్న డకెట్‌ భుజంపై చెయ్యి వేసి.. అవుట్ చేశాను చూశావా అన్నట్టు మాట్లాడాడు. ఆ తర్వాత అంపైర్ ధర్మసేన ఆకాశ్ దీప్‌తో ఇలా చేయడం సరికాదంటూ చెప్పాడు. బెన్ డకెట్ 38 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.


మరో ఓపెనర్ జాక్ క్రాలీ 57 బంతుల్లో 14 ఫోర్లతో 64 పరుగులు బాదాడు. కిల్లింగ్ బౌన్సర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ జాక్ క్రాలీని అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్‌ని ప్రసిద్ధ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రసిద్ధ్ బౌలింగ్ బౌండరీ బాదిన రూట్ కోపంతో ఊగిపోతూ మాటలు జారాడు. ఆ వెంటనే అంపైర్‌తో కూడా డిస్కషన్ చేశాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ అయింది. కరున్ నాయర్ హాఫ్ సెంచరీ చేయగా.. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కీన్‌సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. హిట్టింగ్ టార్గెట్‌గా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మొదటి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. క్రాలీ 64, డకెట్ 43 పరుగులు చేసి అవుటవ్వగా.. ఆ తర్వాత ఇన్నింగ్స్ మెల్లగా సాగింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. 37 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa