ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరాజ్, ప్రసిద్ధ్ జోరు.. ఇంగ్లాండ్ బేజారు.. 92/0 నుంచి 247 ఆలౌట్

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 10:47 PM

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 247 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 224కు కుప్పకూల్చిన ఆతిథ్య జట్టు.. ఆ తర్వాత మెరుగ్గా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు వన్డే తరహాలో రెచ్చిపోవడంతో తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలో 92 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. భారత్ చేసిన స్కోరు తక్కువే ఉండటంతో.. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు.


ఆకాశ్ దీప్‌కు తొలి వికెట్..


ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలీ, బెన్ డకెట్ జోడీని ఆకాశ్ దీప్ విడదీశాడు. 38 బంతుల్లో 43 పరుగులు చేసిన.. బెన్ డకెట్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లాండ్‌కు పరుగులు రావడం కష్టమైంది. ఒక్కసారిగా ఇంగ్లాండ్ స్కోరు నెమ్మదించింది.


సిరాజ్, ప్రసిద్ధ్‌కు నాలుగేసి వికెట్లు.


బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. ఏ బౌలర్ అయినా.. కొత్త బంతితో విజృంభిస్తాడు. కానీ ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మాత్రం బంతి కాస్త పాతదయ్యాక వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్.. కీలక వికెట్లు తీశాడు. ఓలీ పోప్, జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌లను పెవిలియన్ పంపించాడు. దీంతో ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం లభించింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు రాలేదు.


ఓ దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్.. అనూహ్యంగా తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివర్లో హ్యారీ బ్రూక్ (64 బంతుల్లో 53 రన్స్) హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్.. భారత్ చేసిన స్కోరును అధిగమించింది. లేకపోతే.. ఆ జట్టు మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (64), హ్యారీ బ్రూక్ (53), బెన్ డకెట్ (43) పరుగులతో రాణించారు. ఇక 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఎంత స్కోరు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో 300లకు పైగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. భారత్ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa