ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆర్టీసీ కాంప్లెక్స్ పనులు.. నెరవేరనున్న ఏళ్లనాటి కల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 10:29 PM

రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా రహదారులు నిర్మాణంలో చర్యలు చేపడుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే రోడ్లు వంటి మౌలిక వసతులు ముఖ్యమని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో రోజులుగా మూలనపడిన ప్రాజెక్టులలో కూడా కదలిక వస్తోంది. తాజాగా అరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణంపైనా కీలక అప్ డేట్ వచ్చింది. అరకు లోయను ఆంధ్రా ఊటీగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక్కడికి నిత్యం అనేక మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ప్రకృతి సోయగాల మధ్య సేదదీరాలనుకునేవారికి అరకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్. అయితే పర్యాటకులు తరలి వస్తు్న్నప్పటికీ అరకులోయలోని ఆర్టీసీ కాంప్లెక్సులో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.


ఈ నేపథ్యంలో అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్సులో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు, అధికారులు కోరుతున్నారు. పదేళ్ల నుంచి దీనిని పట్టించుకోలేదు. అయితే తాజాగా ఆర్టీసీ ప్రాంతీయ ఛైర్మన్‌గా ఈ ప్రాంతానికి చెందిన దొన్నుదొర బాధ్యతలు చేపట్టడంతో అరకు ఆర్టీసీ కాంప్లెక్స్ మరమ్మత్తులకు మోక్షం కలిగింది. అరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.2 కోట్లు కేటాయించారు. దీంతో ఈ నిధుల సాయంతో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి పనులకు రిపేర్ వర్క్స్ చేయిస్తున్నారు అధికారులు.


మరోవైపు విశాఖపట్నానికి సుమారుగా 115 కిలోమీటర్ల దూరంలో అరకు లోయ ఉంటుంది. తూర్పు కనుమలలో ఉండే ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా తరలి వస్తుంటారు. అరకులో లోయలు, జలపాతాలు, ప్రవాహాలతో పాటుగా ఎత్తైన కొండలు, కాఫీ తోటలు ప్రత్యేక ఆకర్షణ. సుమారుగా 17 తెగలకు చెందిన గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక వీరి సంప్రదాయ నృత్యం థీమ్సా కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అరకులోని గిరిజన మ్యూజియం.. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తుంది. అలాగే అరకు బొటానికల్ గార్డెన్. సంగ్దా జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్లతో పాటుగా ఇక్కడకు సమీపంలోని బొర్రా గుహలను సందర్శించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.


ఇక అరకుకు చేరుకోవాలంటే రైలు, రోడ్డు మార్గాల గుండా వెళ్లవచ్చు. విశాఖపట్నం నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా అరకు చేరుకోవచ్చు. అలాగే కిరండోల్ ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉంది. అద్దాల బోగీలలో సొరంగాలు, కొండలు, జలపాతాలు ఇలా ప్రకృతి మధ్యలో ప్రయాణించాలనుకునేవారికి ఇదో అద్భుత అవకాశం.ఇక ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa