పాక్ నేతలు, అధికారులు చేసే పనులు.. అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులపాలు చేసేలా ఉంటాయి. ఇప్పటికే ఇలాంటివి చాలాసార్లు.. మీడియా, సోషల్ మీడియాలో బయటపడింది. అయితే అన్ని జరిగినా.. పాకిస్తాన్ మాత్రం తమకేమీ పట్టనట్టు మళ్లీ మళ్లీ అలాంటి చేష్టలే చేసి.. ఉన్న పరువును కాస్తా తీసుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ రెండో అత్యున్నత సైనిక పురస్కారాన్ని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. తనకు తానే ప్రకటించుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా ఆపరేషన్ సిందూర్లో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించినందుకు అని పేర్కొనడం.. మరింత జోక్ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్లో భారత్ దాడులకు బెంబేలెత్తిపోయి, కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్.. పైకి మాత్రం తామే గెలిచామని సంబరాలు కూడా చేసుకోవడం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ఇక పాక్ దళాలను సమర్థంగా నడిపించారని పేర్కొంటూ.. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చి.. అంతర్జాతీయంగా పాక్ నవ్వుల పాలైంది. ఇలాంటి సమయంలోనే తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. తనకు తానే పాకిస్తాన్ దేశ రెండో అత్యున్నత సైనిక గౌరవం అయిన హిలాల్-ఎ-జురాత్ను ప్రకటించుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారత సైన్యం చేసిన శక్తివంతమైన దాడుల నుంచి తమ వైమానిక స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలను కూడా రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైన తర్వాత కూడా అసిమ్ మునీర్.. గెలిచినట్లు ప్రకటించుకుని.. తనకు తానే అవార్డు ప్రకటించుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అసిమ్ మునీర్పై రకరకాల మీమ్స్ను తయారు చేస్తూ విరుచుకుపడుతున్నారు. "అసిమ్ మునీర్ నీకు సిగ్గుందా? ఓడిపోయిన వాడికి అవార్డులా? అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓడిపోయినా పాకిస్తాన్కు ఇలాంటివే బాగా అలవాటే అంటూ పేర్కొంటున్నారు.
ఇటీవల పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ తోకముడిచిన సంగతి తెలిసిందే. దాడులు ఆపాలంటూ భారత్కు విజ్ఞప్తి చేయడంతో.. చివరికి యుద్ధం రాకుండా ఆగిపోయింది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పాక్.. ఆపరేషన్ సిందూర్లో తామే విజయం సాధించామని.. భారత దళాలను ఓడించామని గొప్పలు చెప్పుకుంటోంది. అంతేకాకుండా భారత యుద్ధ విమానాలను కూడా కూల్చేశామని.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దాటుకుని మరీ దాడులు చేశామని. డాంభికాలు పలుకుతోంది. అయినా పాక్ చెప్పే అబద్ధాలను.. ప్రపంచ దేశాలు ఏ మాత్రం విశ్వసించడం లేదు. అయినప్పటికీ పాక్ మాత్రం అదే పాట పాడుతూ రోజురోజుకూ ఉన్న పరువును కాస్తా గంగలో కలుపుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa