ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానం,,,?

national |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 07:23 PM

గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందంటూ ఆరోపిస్తూ.. నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనకు సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసును తీసుకు వచ్చేందుకు ఇప్పటికే ప్రతిపక్ష సభ్యులు నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాము దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


ఈ ప్రకటనపై ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయాని సమాచారం. అయితే ఈ తీర్మానాన్ని న్యాయమూర్తిని అభిశంసించే ప్రక్రియ మాదిరిగానే చేపడతామని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఈ రాజకీయ యుద్ధానికి తోడు ఇండియా కూటమి మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇటీవల జరిగిన అంతరిక్ష యాత్రికుడు శుక్లా అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన ప్రత్యేక చర్చకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. లోక్‌సభ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక చర్చను బహిష్కరించాలని ఇండియా కూటమిలోని నాయకులు నిర్ణయించుకున్నారు. ఒక ప్రతిపక్ష నేత ఈ విషయంపై మాట్లాడుతూ... ప్రభుత్వానికి సహకరించే బదులు తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమంటూ వివరించారు.


రాహుల్ గాంధీ గతంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో బీజేపీకి సహాయం చేస్తోందని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సీఈసీ.. "మీరు మీ ఆరోపణలను నిరూపించలేకపోతే అవి నిరాధారమైనవిగా పరిగణించబడతాయి" అని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా రాహుల్ గాంధీ.. 2023లో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టం ద్వారా ఎన్నికల కమిషన్‌ను బీజేపీ రక్షించుకుంటోందని ఆరోపించారు. ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఒకవైపు ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు తమ నిరసనను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలు భారత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa