ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె వయసు 31,.. ఓ భార్యాభర్త ఎంట్రీతో, మొత్తం తలకిందులు

Crime |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:16 PM

ఆమె వయసు 31 సంవత్సరాలు.. పెళ్లైంది కానీ, వైవాహిక బంధం సాఫీగా జరగలేదు. బండికి కట్టిన రెండు ఎద్దులు ఒకేలా నడిస్తేనే ఆ బండి సాఫీగా నడుస్తుంది.. అలాగే కాపురంలోనూ.. ఆలూమగలూ ఇద్దరూ సర్దుకుని పోతేనే కాపురాలు నిలబడతాయి.. సంసారాలు సాఫీగా సాగుతాయి. కారణాలు తెలియదు కానీ, ఆమె కాపురం మాత్రం అనుకున్న విధంగా సాగలేదు. భర్తతో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. విడిగా ఉండాలనుకున్నారు. విడిపోవాలని నిర్ణయించుకున్నారు, విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి బతుకులు వారివి. అయితే భర్త దూరమైనా సరే ఎలాగోలా జీవితాన్ని నెట్టుకుని వస్తున్న ఆమె జీవితంలోకి ఇద్దరు దంపతులు ప్రవేశించారు. వారి ఎంట్రీతో ఆమె జీవితం మారిపోయింది.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది..


పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. గొల్లపూడి ప్రాంతానికి చెందిన ఓ 31 ఏళ్ల మహిళ.. భర్తతో విడాకులు తీసుకుని జీవిస్తున్నారు. ఈమెకు అయోధ్య నగర్‌లో ఉండే రామలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. మాటలతో మొదలైన పరిచయం కాస్తా నమ్మకంగా మారిపోయింది. ఈ మాటల మధ్యలోనే ఈ మహిళకు పెళ్లై, విడాకులు పొందిన సంగతిని రామలక్ష్మి తెలుసుకుంది. సానుభూతి మాటలు కురిపించింది. భర్తకు దూరమై ఈ సంఘంలో ఒంటరిగా బతకడం చాలా కష్టమంటూ సానుభూతి ప్రదర్శించింది రామలక్ష్మి. జీవితం సాఫీగా గడవాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మంచిదని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. తన భర్త సాంబశివరావు సివిల్ ఇంజనీర్ అని.. అతనికి మంచి పరిచయాలు ఉన్నాయని రామలక్ష్మి నమ్మబలికింది. తన భర్తకు ఉన్న పరిచయాలతో సెక్రటేరియట్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించింది. దీంతో రామలక్ష్మి మాయమాటలకు వివాహిత పూర్తిగా బుట్టలో పడిపోయింది.


సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని అనగానే.. ఈ ఏడాది మార్చి నెలలో రూ.6 లక్షలు రామలక్ష్మి, సాంబశివరావు దంపతులకు వివాహిత చెల్లించింది. ఆ తర్వాత పంచాయత్‌రాజ్‌ శాఖలో ఆమెకు.. జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చినట్లు దంపతులు ఇద్దరూ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని ఉద్యోగంలో చేరడానికి వెళ్లిన వివాహితకు ఊహించని షాక్ తగిలింది. ఆ అపాయింట్‌మెంట్ లెటర్ పరిశీలించిన అధికారులు.. అది బోగస్ అని తేల్చారు. దీంతో ఈ విషయమై వివాహిత రామలక్ష్మి దంపతులను నిలదీసింది. దీంతో ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకోవాలనుకున్న దంపతులు.. ఎక్కడో తప్పు జరిగిందని.. మరో లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని మళ్లీ ఆశ పెట్టారు.


దీంతో వివాహిత మరో లక్ష రూపాయలను జులై పదో తేదీ చెల్లించారు. అలా మొత్తం ఏడు లక్షలు రూపాయలు చెల్లించినప్పటికీ ఎలాంటి ఉద్యోగం రాలేదు. రోజులేమో గడిచిపోతున్నాయి. దీంతో ఆ మహిళ.. సాంబశివరావును గట్టిగా నిలదీయటంతో.. అతను ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. జాబ్ సిద్ధంగా ఉందని.. అయితే తన కోరిక తీరిస్తేనే ఉద్యోగం వస్తుందంటూ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు సోమవారం రాత్రి.. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామలక్ష్మి, సాంబశివరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa