ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డయేరియాపై చర్యలు ఎక్కడ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 11:39 AM

విజయవాడలో రోజురోజుకి పెరిగిపోతున్న డయేరియా వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వాన్ని అడిగితే, బుడమేరుపై సాకు చెపుతున్నారు. అసలు బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్‌ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు.  ‘‘మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు. ‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైయ‌స్‌ జగన్‌ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ నాలుగు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa