రోజు రోజుకు భార్యాభర్తల సంబంధం పలుచబారిపోతోంది. మద్యానికి బానిసై ఒకరు.. అహంభావంతో ఇంకొకరు.. అనుమానంతో మరొకరు.. ఇలా పలు రకాల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు, ఘర్షణలు చెలరేగుతున్నాయి. వివాహ బంధానికి బీటలు బారుతున్నాయి. మరికొందరైతే.. తమ భాగస్వాములను ఘోరంగా చంపేస్తున్నారు కూడా. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం వంటి వార్తల నిత్యకృత్యమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి పట్టణంలో వెలుగు చూసింది. ఓ మహిళ తన తమ్ముడి సాయంతో కట్టుకున్న భర్తను ఘోరంగా చంపేసింది. ఆపై గుట్టు చప్పుడు కాకుండా గోనెసంచిలో శవాన్ని కుక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఓ కాలువ గట్టున పాతిపెట్టారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన.. తాజాగా పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో రామన్న, రమణమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన రామన్న ప్రతిరోజు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 12వ తేదీ ఇంటికి వచ్చిన రామన్నను అతని భార్య రమణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ కలిపి రోకలి బడితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. రామన్న మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి ద్విచక్ర వాహనంపై 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి బి.కొత్తకోట మండలం హంద్రీనీవా కాలువ పక్కన గోతి తీసి పాతిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa