గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని.. అన్నీ చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. ఇవాళ(శనివారం) మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తుచేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడంతోపాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తామని తెలిపారు. ఎవరి ప్రవర్తన బాగాలేకపోయినా ప్రజలు క్షమించరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడులో రౌడీయిజాన్ని అణచివేస్తానని చెప్పుకొచ్చారు. చెత్తనే కాదు.. చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఉద్ఘాటించారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తున్నామని ప్రకటించారు. కొందరు మాటలు మాత్రమే చెబుతారని.. తాము చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. అందరికీ ఆదాయం పెరగాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. వాట్సాప్ ద్వారానే అన్ని సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. చెత్త నుంచి పెద్దఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉందని.. త్వరలోనే రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. జూన్ 26వ తేదీకి ఏపీ మొత్తం ప్లాస్టిక్ రహితంగా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa