ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ వార్నింగ్‌లకు పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం

international |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 09:22 PM

కింద పడినా.. నాదే పైచేయి అనేవాడట వెనుకటికి ఎవరో. అచ్చం అలానే ఉంది పారిస్థాన్ పరిస్థితి చూస్తుంటే. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శస్తోంది. గత కొద్ది రోజులుగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే.. పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయని.. మ్యాప్‌లోంచి లేపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇందులోనూ భారత్‌ను పాకిస్థాన్ కాపీ కొట్టింది. ఇక భారత్ ఆర్మీ చీఫ్ వార్నింగ్‌కు.. పాక్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్ సమాధానమిచ్చారు. మన రక్షణ మంత్రి వార్నింగ్‌కు.. వారి రక్షణ మంత్రి చేత హెచ్చరిక ఇప్పించింది పాక్.


విమాన శిథిలాల కింద కప్పేస్తాం..


పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజ ఆసిఫ్.. ఆదివారం ఎక్స్‌లో భారత్‌ను రెచ్చగొట్టే పోస్టు పెట్టారు. "చెడిపోయిన వారి ఖ్యాతిని తిరిగితెచ్చుకోవడానికి చేస్తున్న విఫలయత్నమే.. భారత సైనిక, రాజకీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు. అప్పుడు 0-6 స్కోరుతో ఓడిపోయారు. ఈ సారి వారు మళ్లీ ప్రయత్నిస్తే.. దేవుడు అనుకుంటే.. ఆ స్కోరు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది" అని రాసుకొచ్చారు. అంతేకాకుండా.. "చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత భారతదేశంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మారిపోయిందో.. మోదీ, ఆయన బృందం వారి విశ్వసనీయతను ఎలా కోల్పోయారో.. ఆ ఒత్తిడి వారు చేసే ప్రకటనల్లో ప్రతిబింబిస్తోంది. పాకిస్తాన్ అల్లాహ్ పేరుతో స్థాపించబడిన దేశం. మా రక్షకులు అల్లా సైనికులు. ఈసారి, దేవుడు కోరుకుంటే.. భారత్‌ను దాని యుద్ధ విమానాల శిథిలాల కింద కప్పేస్తాం" అని సొంతంగా మాట్లాడే ధైర్యం లేకున్నా.. మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తోంది పాక్.


 భవిష్యత్తులో భారత్, పాక్ మధ్య తలెత్తే వివాదం వినాశనానికి దారితీస్తుందని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు. పాకిస్తాన్ సాయుధ దళాలు శత్రువు భూభాగంలోని ప్రతి మూలలో పోరాటాన్ని తీసుకెళ్లగలుగుతాయన్నారు. "మాపై దూకుడుగా వ్యవహరించడానికి బాధ్యతా రహితమైన ప్రకటనలు చేస్తున్నారు. మరో ఆపరేషన్ సిందూర్ వంటి చర్యకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే అది దక్షిణాసియా మొత్తానికి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది" అని మిగతా దక్షిణాసియాలో దేశాల దృష్టిలో పడేలా మాట్లాడారు మునీర్.


భారత్ వార్నింగ్?


ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండాలనుకుంటే.. ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని.. భారత్ ఆర్మీ చీఫ్ జనర్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం (ఆక్టోబర్ 3) గట్టి హెచ్చరిక ఇచ్చారు. భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16లను కూల్చేశామన్నారు.


దీనికి ముందు రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా.. పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే గుజరాత్‌ను కరాచీకి మార్గం ఉందనే విషయం ఆ దేశం మర్చిపోకూడదని అన్నారు. ఇక ఇదే రోజు ఉపేంద్ర ద్వివేది కూడా.. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పాటించినట్లు.. ఈసారి సంయమనం పాటించబోమని అన్నారు.


పాకిస్థాన్ ఇలా భారత్‌ను కాపీ కొట్టడం ఇదే మొదటి సారి కాదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్ర పాకిస్థాన్‌ను ప్రపంచ వేదికపై ఎండగట్టాలని పార్లమెంటరీ కమిటీలు వేసింది భారత్. పాక్ కూడా అచ్చం ఇలానే పీస్ డెలిగేషన్ అంటూ విదేశాలకు రాజకీయ బృందాలను పంపించింది. ప్రధాని మోదీ అదంపూర్ మిలిటరీ బేస్‌కు వెళ్లి.. బ్యాక్‌గ్రౌండ్‌లో క్షిపణులు ఉండగా.. ప్రసంగం చేశారు. అయితే ఇదే ప్రయత్నం సియాల్కోట్‌లో చేయబోయి.. పరువు తీసుకున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇలాంటి మిమిక్‌లు చాలానే చేసింది పాకిస్థాన్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa