పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (KSPCB) బిగ్ బాస్ కన్నడ స్టూడియోను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ, కాలుష్య నియంత్రణకు సంబంధించి తీవ్రంగా స్పందించింది.ప్రస్తుతం బెంగళూరు సౌత్లోని రామనగర జిల్లా బిడాదిలో ఉన్న ‘జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్’ ప్రాంగణంలో ఈ రియాలిటీ షో షూటింగ్ కొనసాగుతోంది.కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ప్రముఖ రియాలిటీ షో పర్యావరణానికి హాని చేస్తోందన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అనుమతులు లేకుండా షూటింగ్ జరపడంతో పాటు, శుద్ధి చేయని నీటిని బయటకి వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, రామనగర డిప్యూటీ కమిషనర్కు బిగ్ బాస్ హౌస్ను సీజ్ చేయాలని KSPCB ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలంటూ BESCOM (బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ)కు ఆదేశాలు పంపించింది.రూ. 300 కోట్ల వ్యాపార విలువ కలిగిన బిగ్ బాస్ కన్నడ షోకి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, బిగ్ బాస్ కంటెస్టెంట్లను హౌస్ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అనంతరం హౌస్ను అధికారికంగా సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన వెంటనే గేట్లు మూసేశారు.ఈ పరిణామాలతో నిర్వాహకులు తీవ్ర కష్టాల్లో పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు వారు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, బిగ్ బాస్ టీమ్ మీడియా దృష్టిని మళ్లించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హౌస్ నుంచి బయలుదేరిన కార్లు బెంగళూరు, చెన్నపట్నం వైపుగా ప్రయాణిస్తున్నప్పటికీ, స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.ఇదిలా ఉండగా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. గతంలో ఎన్నో సార్లు నోటీసులు పంపించినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదని, ఇప్పుడు చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa