ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం నాడు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఈ చారిత్రక వేడుకకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో విజయనగరం పట్టణం జనసంద్రంగా మారింది. భక్తి పారవశ్యంతో మార్మోగిన జయజయధ్వానాల నడుమ సిరిమాను ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.సిరిమాను ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన ఊరేగింపులో, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు. అమ్మవారి ప్రతిరూపంగా ఆయన భక్తులను ఆశీర్వదించారు. చారిత్రక చదరగుడి వద్ద మొదలైన ఈ ఊరేగింపు, విజయనగరం కోట వరకు సాగింది. సిరిమానుకు ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల, అంజలి రథం వంటివి కదులుతుండగా, భక్తుల కోలాహలం మధ్య ఉత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తమ కోరికలు నెరవేరతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa