ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా క్రికెట్ సత్తాను ప్రపంచానికి చూపిద్దామన్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:53 PM

ప్రతిష్ఠాత్మక ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని సుందర నగరం విశాఖపట్నం కూడా ఉందన్న సంగతి తెలిసిందే. నిన్ననే విశాఖలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగింది. దీనిపై రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికే గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ, "ఐసీసీ మహిళల ప్రపంచకప్ మన అందమైన నగరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. మన నగరం యొక్క ఉత్సాహభరితమైన క్రికెట్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని తెలిపారు. వైజాగ్ నగర అందాలతో పాటు, ఇక్కడి స్టేడియంలోని పిచ్ పరిస్థితులు అద్భుతంగా ఉంటాయని గతంలో పలువురు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "మనం అందరం కలిసి స్టేడియాలను నింపేద్దాం. ప్రతి బౌండరీకి మద్దతు తెలుపుతూ, ఆంధ్రా క్రికెట్ గర్జనను ప్రపంచానికి వినిపిద్దాం. ప్రపంచ స్థాయి క్రికెట్ అనుభూతిని అందించి, ఈ టోర్నీ ద్వారా ఆటగాళ్లకు, ప్రేక్షకులకు మరపురాని జ్ఞాపకాలు మిగిల్చేందుకు కృషి చేద్దాం" అని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నగరం యొక్క కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్వీట్ తో పాటు ఓ ఆసక్తికర వీడియో కూడా పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa