ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించడానికి సిద్ధమవుతోంది. విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్న దాదాపు 2,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) నోటిఫికేషన్ను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి సన్నాహకంగా ముందుగా డిసెంబరు నెలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రతిసారీ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈసారి విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిపుణులతో సమగ్రంగా చర్చించి, అర్హతలు, నిబంధనలలో అవసరమైన మార్పులు చేయాలని భావిస్తున్నారు. పారదర్శకత, వివాద రహిత నియామక ప్రక్రియ లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతోంది. తద్వారా, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తక్కువ సమయంలోనే పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మొత్తం 16,317 పోస్టులకు గాను 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన 376 పోస్టులతో పాటు, ఉపాధ్యాయుల పదవీ విరమణ, ఇతరత్రా కారణాల వల్ల ఏర్పడిన కొత్త ఖాళీలను కలిపి సుమారు 2,000 టీచర్ పోస్టులకు ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.
డిసెంబరులో టెట్, ఆపై జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుండడంతో, టీచర్ ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. నూతన నిబంధనలు, అర్హతలపై త్వరలో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించడానికి ఉపయోగపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa