భారతదేశ నదులు కేవలం వారసత్వ చిహ్నాలు మాత్రమే కావని, అవి దేశ ప్రగతికి కొత్త రహదారులుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా రవాణా, పర్యాటక రంగాలు బలోపేతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధాని శుక్రవారం తన 'ఎక్స్' సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు."వికసిత్ భారత్ నిర్మాణం దిశగా పునరుజ్జీవం పొందిన మన జలమార్గాలు ఎలా పయనిస్తున్నాయో" వివరిస్తూ సోనోవాల్ ఈ వ్యాసాన్ని రాశారు. ఒకప్పుడు మన దేశంలో నదులే ప్రధాన రవాణా మార్గాలుగా ఉండేవని, రోడ్లపై ట్రక్కుల హవా పెరగకముందే పట్నా, దిబ్రూగఢ్ వంటి ప్రాంతాల నుంచి కోల్కతాకు సరుకులు నదుల మీదుగానే చేరేవని సోనోవాల్ గుర్తుచేశారు. "భారత నదులే మన తొలి హైవేలు. కాలక్రమేణా రైలు, రోడ్డు మార్గాలు రావడంతో వాటి ప్రాధాన్యం తగ్గింది" అని ఆయన తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ కృషితో ఇప్పుడు నదులకు మళ్లీ పూర్వ వైభవం వస్తోందని సోనోవాల్ వివరించారు. 2014 వరకు దేశంలో కేవలం 5 జాతీయ జలమార్గాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 111కి పెరిగిందని, వీటిలో 32 ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మార్పు వల్ల తక్కువ ఇంధన వినియోగం, తక్కువ కాలుష్యం, చౌకైన రవాణా వంటి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.జలమార్గాల ద్వారా సరకు రవాణాలో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. 2013-14లో కేవలం 18 మిలియన్ టన్నులుగా ఉన్న సరకు రవాణా, 2024-25 నాటికి 145 మిలియన్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో 2030 నాటికి 200 మిలియన్ టన్నులు, 2047 నాటికి 250 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలిపారు.అదే సమయంలో నదీ పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని సోనోవాల్ అన్నారు. దశాబ్దం క్రితం కేవలం 5 క్రూయిజ్ నౌకలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 13 జలమార్గాల్లో 25 క్రూయిజ్ నౌకలు సేవలందిస్తున్నాయని చెప్పారు. గంగా, బ్రహ్మపుత్ర, కేరళ బ్యాక్వాటర్స్ ఈ రంగంలో ముందున్నాయని, వారణాసి, కోల్కతా, పాట్నా, గౌహతి వంటి టెర్మినళ్లను ఆధునికీకరిస్తున్నామని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa