ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడీలలోని విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 07:06 PM

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు మన దేశంలో అన్నింటికీ ఆధారంగా మారిపోయింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మొదలుకొని.. రైలు టికెట్ల రిజర్వేషన్, దేవాలయాల్లో దర్శనాల వరకూ అన్నింటా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. దీనికి తోడు విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్స్, ఇతరత్రా సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కార్డు ప్రామాణికంగా మారిపోయింది. దీంతో దేశ పౌరులు అందరికీ ఆధార్ కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చిన్నారులకు కూడా ఆధార్ కార్డు ఉండేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డు అప్‌డేట్, వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకునే వీలు కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుకునే విద్యార్థులలో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే నెలరోజుల్లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక సూచనలు చేశారు.


బర్త్ సర్టిఫికేట్లు ఉన్నవారు, లేనివారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే.. అలాంటి వారితో వెంటనే దరఖాస్తు చేయించాలని సూచించారు. బర్త్ సర్టిఫికేట్ అందిన వెంటనే ఆధార్ కార్డు కోసం నమోదు చేయించాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియను నెలరోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మరోవైపు మధ్యాహ్న భోజన పథకం గురించి సమీక్షించిన కలెక్టర్.. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు రాకూడదని.. వంట సామాగ్రిని భద్రపరచడం దగ్గర నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించరాు. కీటకాలు, ఎలుకలు వంటివి ఆహారంపై పడకుండా చూడాలని.. పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలని స్పష్టం చేశారు.అలాగే ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి వంటివి పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa