ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తుండగా....రమేష్ బంధువులను వెంటాడిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:28 PM

కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన నెల్లూరు జిల్లా వాసి రమేష్ కుటుంబ సభ్యులను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లెకు చెందిన రమేష్ కుటుంబం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రమేష్ దంపతులతో పాటుగా వారి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం రమేష్, తన భార్యాపిల్లల మృతదేహాలను అధికారులు వారి కుటుంసభ్యులకు అప్పగించారు. దీంతో రమేష్ కుటుంబసభ్యులు సోమవారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రమేష్ అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తున్న వారి బంధువులు ప్రమాదానికి గురయ్యారు.అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.


వింజమూరు మండలం గోళ్లవారిపల్లెలో రమేష్, అతని భార్యాపిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం వారి బంధువులు కారులో విజయవాడకు తిరిగి వెళ్తుండగా.. జలదంకి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదానికి గురైంది. టైరు పంక్చర్ కావటంతో అదుపు తప్పింది. ఈ క్రమంలోనే కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరోవైపు.. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్‌, అతని భార్య అనూష, కొడుకు శశాంక్, కూతురు మన్విత సజీవ దహనమయ్యారు. రమేష్‌ బెంగళూరులో స్థిరపడ్డారు. హిందూస్థాన్‌ యూని లివర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. దీపావళి పండగ రావటంతో నెల్లూరు జిల్లాకే చెందిన నెలకుర్తి రమేష్‌ కుటుంబంతో కలసి హైదరాబాద్‌ వచ్చారు. తిరిగి బెంగళూరుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


మరోవైపు గోళ్లవారిపల్లెకు చెందిన మాలకొండయ్య, సుశీల దంపతులకు రమేష్‍తో పాటుగా మరో ముగ్గురు కుమార్తెలు సంతానం. అయితే కూతురు ధనమ్మ కుమార్తె అయిన అనూషను మేనమామ అయిన రమేష్‌కు ఇచ్చి పెళ్లి జరిపించారు. ధనమ్మ భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు కుమార్తె అనూషతో పాటుగా తమ్ముడు అతని కుటుంబాన్ని కూడా కోల్పోవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa