జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'నగదు ప్రోత్సాహక పథకం' కింద అర్హులైన వారికి పారితోషికం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించింది. ఈ విషయంపై శాప్ ఛైర్మన్ రవినాయుడు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం గర్వించేలా పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. "ఆసక్తిగల క్రీడాకారులు 'శాప్ క్రీడాయాప్' లేదా అధికారిక లింక్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్రీడాకారులు 95735 52108, 82473 02497, 95538 21065 నంబర్లలో సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa