ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో నిలిచిపోయిన ‘మేఘమథనం’.. : ఐఐటీ కాన్పూర్ కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:11 PM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చేపట్టిన ‘మేఘమథనం’ నిలిచిపోయింది. కృత్రిమ వర్షం కురవడానికి గాలిలో తగినంత తేమ లేకపోవడంతోనే ఈ ప్రక్రియను నిలిపివేసినట్టు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీ-కే) తెలిపింది. కృత్రిమ వర్షం కురిపించే ప్రక్రియను ఐఐటీ కాన్పూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబరు 28న మంగళవారం రాజధానిలో రెండుసార్లు కృత్రిమ వర్షం కురిపించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చిన్నపాటి వర్షం కూడా కురకపోవడంతో బుధవారం మళ్లీ ప్రయత్నించాలని భావించారు. కానీ, గాలిలో తేమ తగినంతగా లేకపోవడంతో విరమించుకున్నారు.


‘‘ఈ రోజు కృత్రిమ వర్షం ప్రక్రియను చేపట్టాలని అనుకున్నాం.. కానీ, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో నిలిపివేశాం.. ఈ ప్రక్రియ అనుకూలమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని ఐఐటీ కాన్పూర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘గాలిలో తేమస్థాయిలు సుమారు 15 నుంచి 20 శాతం మాత్రమే ఉండటంతో వర్షం కురిపించడం వీలుపడకపోయినా ఈ ప్రయోగం విలువైన అవగాహనలను అందించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ స్టేషన్లు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్, తేమ స్థాయిలలో చోటు చేసుకున్న తక్షణ మార్పులను రికార్డు చేశాయి. డేటా ప్రకారం PM2.5, PM10 స్థాయిలలో 6 నుంచి 10 శాతం వరకు తగ్గుదల నమోదైంది. అంటే తేమ పరిమితమైన పరిస్థితులలో కూడా మేఘ మథనం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది’ అని తెలిపింది.


‘‘ఈ పరిశీలన భవిష్యత్ కార్యకలాపాల ప్రణాళికను మరింత బలోపేతం చేస్తాయి..అత్యధిక ప్రయోజనం ఇచ్చే పరిస్థితులను గుర్తించడానికి మాకు సహాయపడతాయి. ఇటువంటి అనుభవాలు భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన ప్రక్రియకు పునాది వేస్తాయి. రాజధాని ప్రాంతంలో పర్యావరణ ఫలితాలను మెరుగుపరచడం కోసం, శాస్త్రీయ శిక్షణ, స్పష్టమైన దృష్టితో ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంలో ఐఐటీ కాన్పూర్ కట్టుబడి ఉంది’ అని ఆ విద్యాసంస్థ పేర్కొంది. ఢిల్లీలో కాాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పదేపదే గగ్గోలుపెడుతూనే ఉంది.


మేఘమథనం అనేది వర్షాభావ ప్రాంతాల్లో కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు ఉపయోగించే సాంకేతికత. విమానం సహాయంతో మేఘాలపై సిల్వర్ అయోడైడ్ లేదా క్లోరైడ్ వంటివి పిచికారీ చేస్తారు. ఇవి నీటి తుంపర్లు లేదా మంచు స్ఫటికాలు ఏర్పడేందుకు కేంద్రాలుగా పనిచేస్తాయి తద్వారా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ ఫలితాలు మేఘాల రకం, ఉష్ణోగ్రత, తేమ స్థాయి, గాలి దిశ, వేగం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ‘తేమ తక్కువ స్థాయిలో ఉండటం వర్షం కురిసే అవకాశం లేకపోయినా కానీ ఈ ట్రయల్ మేము ప్రయత్నాన్ని కొనసాగించగలమని మా బృందానికి మరింత నమ్మకాన్ని ఇచ్చింది’ అని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa