ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి పక్కన రఫేల్ ఫైటర్ జెట్‌తో ఐఏఎఫ్ పైలట్ శివంగి సింగ్,,,ఒక్క ఫోటోతో పాక్ అబద్ధాలకు చెక్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:12 PM

భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్‌పై పాకిస్తాన్ మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక్క ఫొటోతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా ఐఏఎఫ్ పైలట్ శివాంగి సింగ్ ప్రయాణిస్తున్న యుద్ధ విమానాన్ని కూల్చివేశామని.. పాకిస్తాన్ సైన్యానికి ఆమె ఒక యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారని పాకిస్తాన్ మీడియా సంస్థలు గత కొన్ని రోజులుగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్‌లో స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి చిరునవ్వుతో దృఢంగా కనిపించారు.


బుధవారం అంబాలా ఎయిర్‌బేస్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పైలట్ శివంగి సింగ్ స్వయంగా కొత్త రాఫెల్ యుద్ధ విమానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ఆమె నవ్వుతూ ఒక ఫోటోకు పోజు ఇచ్చారు. ఈ ఫోటోను ఐఏఎఫ్ షేర్ చేయడంతో శివంగి సింగ్‌పై పాకిస్తాన్ ప్రచారం పచ్చి అబద్ధమని ప్రపంచానికి వెల్లడైంది.


పాకిస్తాన్ మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ దుష్ప్రచారాన్ని.. భారత వైమానిక దళం అధికారిణి శివంగి సింగ్ ప్రత్యక్షంగా, ఆరోగ్యంగా కనిపించడంతో బద్దలు కొట్టింది. ఈ సంఘటన.. భారత రక్షణ దళాల పటిష్టతను.. దేశానికి సేవలందిస్తున్న నారీ శక్తి ధైర్యాన్ని మరోసారి రుజువు చేసింది. యుద్ధ ఖైదీ అంటూ పాక్ మీడియా వ్యాప్తి చేసిన వార్తలకు.. స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్ చిరునవ్వే దీటైన జవాబుగా నిలిచిందని విశ్లేషకులు వెల్లడించారు.


అంబాలా ఎయిర్‌బేస్ నుంచి రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లో ద్రౌపది ముర్ము ప్రయాణించగా.. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన.. ఆపరేషన్‌ సిందూర్‌లో రఫేల్‌ ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన రఫేల్ యుద్ధ విమానంలో తాజాగా ద్రౌపది ముర్ము చక్కర్లు కొట్టడం గమనార్హం.


మరోవైపు.. 2023 మే 8వ తేదీన ద్రౌపదీ ముర్ము అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో విహరించారు. ఇక ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో 2009లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఈ సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్‌జెట్‌లో ఆకాశంలో చక్కర్లు కొట్టారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.. పుణె ఎయిర్‌బేస్ నుంచి సుఖోయ్‌-30 ఫైటర్ జెట్‌లో విహరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa