భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన 'మొంథా' తుఫాను తీరం దాటిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాను అనంతర పరిస్థితులపై మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని, దీనికోసం తక్షణం 'సూపర్ క్లోరినేషన్' తో పాటు 'సూపర్ శానిటేషన్' కార్యక్రమాలను చేపట్టాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. రహదారుల పునరుద్ధరణ పనులను వెంటనే మొదలు పెట్టాలని, ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని ఆయన అధికారులకు ఉద్ఘాటించారు.
మొంథా తుఫాను వల్ల రాష్ట్రంలో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తోంది. దెబ్బతిన్న వరి పొలాలను, నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. నష్టం అంచనాలను రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు పవన్ కళ్యాణ్కు తెలిపారు.
తుఫాను కారణంగా నష్టపోయిన వివరాలను పారదర్శకంగా సేకరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తోంది. పంట నష్టానికి సంబంధించిన వివరాలు, ఆస్తి నష్టం అంచనాలను ప్రజల నుంచి నేరుగా వాట్సాప్లో సేకరించి, దీని ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. తుఫాను అనంతర సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa