మహిళల ప్రపంచకప్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. నిన్న జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్లో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాపై అద్వితీయ విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కడంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది.నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 ఓవర్లలో 59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (89)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్కు 167 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించారు. అయితే, భారత్ విజయానికి 113 పరుగులు అవసరమైన దశలో హర్మన్ప్రీత్ ఔటైనా, జెమీమా ఒంటరి పోరాటం చేసింది. చివర్లో అమన్జోత్ కౌర్ బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయగా, భారత శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదన. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో పురుషుల, మహిళల క్రికెట్లో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మహిళల ప్రపంచకప్ నాకౌట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫీబీ లిచ్ఫీల్డ్ రికార్డు సృష్టించింది. అలాగే ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి అత్యధికంగా 679 పరుగులు నమోదు చేశాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల పేరిట ఉండేది బ్రిస్టల్, 2017 ప్రపంచ కప్లో 678 పరుగులు.ఇక, ఈ విజయంతో భారత్ ఆదివారం ఇదే వేదికపై జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కాగా, మెల్బోర్న్లో శిక్షణ సమయంలో బంతి తగిలి మరణించిన 17 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృతికి సంతాపంగా ఇరు జట్ల క్రీడాకారిణులు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa