ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క క్లిక్‌తో ఇంటికే పండ్లు, కూరగాయలు.. రైతు బజార్ ధరలకే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 07:12 PM

ప్రస్తుత ఆండ్రాయిడ్ యుగంలో అన్నీ ఆన్‌లైన్‌గా మారిపోయాయి. ఏది కావాలన్నా సెల్ ఫోన్‌లో క్లిక్ చేస్తే చాలు.. డోర్ డెలివరీ అవుతోంది. కూరగాయల నుంచి ఆహారం వరకూ.. ఫోన్ నుంచి మెడిసిన్ వరకూ ప్రతిదీ ఇంటిముందు వాలిపోతోంది. అయితే టెక్నాలజీ ఇంతగా మారుతున్నా.. దీనితో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయా అంటే అనుమానమే. అయితే మారుతున్న టెక్నాలజీ సాయంతో రైతులు వినియోగదారుల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచన చేసింది. అదే రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయలను ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం.


ఇలాంటి సేవలను ప్రైవేట్ రంగంలో ఇప్పటికే స్విగ్గీ, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి సంస్థలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ప్రభుత్వం కూడా పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేయనుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.


రైతులకు, వినియోగదారులకు ఇద్దరికీ లాభం చేకూర్చడానికి ఈ విధానం ప్రారంభించారు. మాచింట్ సొల్యూషన్స్ అనే సంస్థ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా రైతు బజార్లను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారంపైకి తెచ్చింది. https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్‌ ఇందుకోసం రూపొందించారు. ఈ వెబ్‌సైట్ సందర్శించినప్పుడు రైతుబజార్లలోని ఆ రోజు అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, వాటి ధరల వివరాలు కనిపిస్తాయి. మనకు నచ్చినవి ఎంచుకుని ఆర్డర్ చేయొచ్చు. ఆ తర్వాత నిమిషాలలోనే ఆర్డర్ చేసిన వాటిని మాచింట్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తారు. దీని ద్వారా రైతు బజార్ల నుంచి తాజా పండ్లు, కాయగూరలు రైతు బజార్లలో దొరికే ధరలకే కొనుగోలు చేసే వీలుంటుంది. అలాగే ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు.


విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతుబజారులో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ విధానం ప్రారంభించారు. రైతుబజారుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారి నుంచి ఆర్డర్లు తీసుకొని సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మిగిలిన రైతు బజార్లకు కూడా ఈ సేవలు విస్తరించనున్నారు. అలాగే వెబ్ సైట్ స్థానంలో త్వరలోనే యాప్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa