కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారని సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి ఉంటుంది, దాని విధివిధానాలు, 2026-27 బడ్జెట్లో నిధుల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, పే కమిషన్ అమలు తేదీని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. వేతన సంఘం ఏర్పాటైన నాటి నుంచి 18 నెలల్లోగా తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వేతన సంఘం సిఫార్సులను పరిశీలించి, ఆమోదించిన తర్వాత వాటి అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని పంకజ్ చౌధరి హామీ ఇచ్చారు. "ఆమోదించిన సిఫార్సుల అమలుకు ప్రభుత్వం తగినన్ని నిధులను అందుబాటులో ఉంచుతుంది. సిఫార్సుల రూపకల్పనకు సంబంధించిన పద్ధతులు, విధివిధానాలను కమిషనే రూపొందిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు, దాని విధివిధానాలను కూడా ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిషన్ పరిశీలించి, సిఫార్సులు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఈ తాజా ప్రకటనతో ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్న పలు సందేహాలకు తెరపడినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa