ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన సత్య నాదెళ్ల.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లక్ష్యాలను సాధించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం.
ఇక ఈ రూ.1.5 లక్షల కోట్ల నిధులను 2026 నుంచి 2029 వరకు రాబోయే నాలుగేళ్లలో భారత్లో ఏఐకి అవసరమైన మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ నైపుణ్యాల అభివృద్ధి, సెక్యూర్డ్ డేటా సిస్టమ్స్ కోసం వినియోగించనున్నట్లు సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి అదనంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ భారత్లో ఈ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడిని పెట్టనుందని ప్రకటించారు. భారతదేశ ఏఐ లక్ష్యాలకు మద్దతుగా రాబోయే 5 ఏళ్లలో కోటి మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా ఈ మైక్రోసాఫ్ట్ చరిత్రాత్మక పెట్టుబడి గురించి ప్రకటన చేశారు. భారతదేశ ఏఐ ఆశయాలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ఈ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఆసియా ఖండంలోనే తమ సంస్థ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి అని సత్య నాదెళ్ల తన ట్వీట్లో పేర్కొన్నారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలను, సార్వభౌమ సామర్థ్యాలను అందించడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టే ఈ నిధులు ఉపయోగపడతాయని సత్య నాదెళ్ల తెలిపారు.
ఇక సత్య నాదెళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఏఐ విషయానికి వస్తే.. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని తెలిపారు. సత్య నాదెళ్లతో చర్చ ఫలప్రదంగా జరిగిందని.. ఆసియాలో ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం భారత్ కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏఐ శక్తిని ఆవిష్కరించడానికి, ఉపయోగించుకునేందుకు భారత యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని వెల్లడించారు.
ప్రస్తుతం ఏఐ ఉత్పత్తులకు భారత్.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా ఉండటంతో.. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా ఇతర పెద్ద టెక్ కంపెనీలు కూడా భారీ పెట్టుబడులను ప్రకటిస్తున్నాయి. భారత స్థానిక క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాల కోసం 12.7 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని మరో టెక్ దిగ్గజం అమెజాన్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా 2030 నాటికి భారత్లో 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తోంది. అలాగే రానున్న 5 ఏళ్లలో 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa