తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్కు కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా ఆయన్ను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.ఈ నియామకంతో కనకమేడల సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక కేసుల్లో వాదనలు వినిపిస్తారు. అదనపు సొలిసిటర్ జనరల్ పదవి కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు సహాయకుడిగా వ్యవహరిస్తూ, సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రభుత్వం తరఫున వాదించాల్సి ఉంటుంది.కనకమేడల రవీంద్ర కుమార్కు న్యాయ, రాజకీయ రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో పలు కీలక కేసులను వాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా గతంలో వాదనలు వినిపించారు. రాజ్యాంగం, పరిపాలన అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. 2018 నుంచి 2024 వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించారు. టీడీపీ లీగల్ సెల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న తరుణంలో, ఆ పార్టీకి చెందిన నేతకు ఇంతటి ముఖ్యమైన న్యాయ పదవి దక్కడం రాజకీయంగా కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసుల్లో బలమైన న్యాయ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa