వివాహేతర సంబంధం, ఆపై అసభ్యకర వీడియోలతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన ఓ యువకుడిని అక్కాచెల్లెళ్లు పథకం ప్రకారం అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి సంబంధం చెడగొట్టాడన్న కోపం, పరువు పోతుందన్న భయం ఇద్దరు మహిళలను హంతకులుగా మార్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ (32) హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్నాడు. మహేందర్కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరగ్గా.. అతనికి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువతితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదే క్రమంలో ఆమె అక్కతోనూ పరిచయం పెంచుకుని ఇద్దరితోనూ సంబంధం కొనసాగించాడు. అయితే, ఇటీవల ఆ యువతికి ఒక మంచి పెళ్లి సంబంధం రాగా.. దానిని మహేందర్ సహించలేకపోయాడు. తన వద్ద ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను చూపించి ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలతో మళ్లీ బ్లాక్మెయిలింగ్కు దిగడంతో అక్కాచెల్లెళ్లు అతనిపై కక్ష పెంచుకున్నారు.
మహేందర్ వేధింపుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలని నిర్ణయించుకున్న అక్కాచెల్లెళ్లు.. అతడిని అంతమొందించేందుకు పథకం వేశారు. ప్లాన్ ప్రకారం.. యువతి శుక్రవారం రాత్రి మహేందర్కు ఫోన్ చేసి, తన అక్క ఉండే గ్రామానికి రమ్మని పిలిచింది. ఆమె మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన మహేందర్తో రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ గొడవకు దిగారు. వాగ్వాదం జరుగుతుండగానే ముందే సిద్ధం చేసుకున్న కారాన్ని అతని కళ్లలో చల్లారు. కళ్లు కనిపించక మహేందర్ విలవిలలాడుతుండగా.. అక్కాచెల్లెళ్లతో పాటు అక్క కుమారుడు, మరో ఇద్దరు బంధువులు కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహేందర్ రక్తం మడుగులో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మహేందర్ మృతి చెందాడు.
హత్య సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ ఎస్సై ఉమాసాగర్, సీఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఈ కేసును నేరుగా పర్యవేక్షిస్తున్నారు. క్షణికావేశం, పగ వెరసి ఒకరి ప్రాణం తీయగా.. మరో ఐదుగురి జీవితాలను జైలు పాలు చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa