ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 09:24 PM

విదేశీ గడ్డపై ఉపాధి పొందుతూ సంతోషంగా గడుపుతున్న ఒక భారతీయ కుటుంబంలో ఎవరూ ఊహించని విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అబుదాబిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు సహా వారి ఇంటి పని మనిషి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ 'లివా ఫెస్టివల్' సందర్శనకు వెళ్లారు. పండగ ముగించుకుని తిరిగి దుబాయ్ వస్తున్న క్రమంలో.. షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో లతీఫ్ కుమారులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 ఏళ్ల అషాజ్, 12 ఏళ్ల అమ్మార్, ఐదేళ్ల అయ్యష్‌లతో పాటు వారి వద్ద పని చేస్తున్న బుష్రా అనే మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు కొడుకులు కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.


ఇదీ చూడండి: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు తెలుగమ్మాయిలు మృతి


ప్రమాద సమయంలో కారులో ఉన్న తల్లిదండ్రులు అబ్దుల్ లతీఫ్, రుక్సానా, మిగిలిన ఇద్దరు పిల్లలు ఎజ్జా (10), అజ్జామ్ (7)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు అబుదాబిలోని షేక్ షక్బౌట్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.


అక్కడే అంత్యక్రియలు


మరణించిన చిన్నారుల మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. వారి అంత్యక్రియలను యూఏఈ లోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఎన్నారైల వీసా ఎక్కడ జారీ అయితే అక్కడే అంత్యక్రియలు జరగాలి. కానీ ప్రమాదం అబుదాబిలో జరిగినందున అక్కడే ఖననం చేసేందుకు ప్రత్యేక అనుమతి కోసం సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మరణించిన ఇంటి పని మనిషి బుష్రా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతుల కుటుంబానికి మద్దతుగా కేరళ అసోసియేషన్, భారతీయ దౌత్య కార్యాలయ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కళ్ల ముందే ముగ్గురు బిడ్డలను కోల్పోయిన ఆ దంపతుల పరిస్థితి చూసి అక్కడి వారు కన్నీరుమున్నీరవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa