భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 12వ తేదీన ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.ఈ మిషన్లో ప్రధాన ఉపగ్రహమైన EOS-N1కు 'అన్వేష' అని కూడా పేరు పెట్టారు. వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పర్యవేక్షణ వంటి కీలక రంగాలలో దేశ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. "రాకెట్, ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ప్రయోగానికి ముందు జరగాల్సిన తనిఖీలు కొనసాగుతున్నాయి అని ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ ప్రయోగంలో స్పెయిన్కు చెందిన ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన 'కెస్ట్రెల్ ఇనీషియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్' అనే ఒక చిన్న రీ-ఎంట్రీ వాహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు. అన్ని ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది.పీఎస్ఎల్వీ రాకెట్కు ఇది 64వ ప్రయోగం కాగా, రెండు స్ట్రాప్-ఆన్ మోటార్లు కలిగిన పీఎస్ఎల్వీ-డీఎల్ వేరియంట్తో ఇది ఐదో ప్రయోగం. చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య-ఎల్1 వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రయోగాలను పీఎస్ఎల్వీ విజయవంతంగా పూర్తి చేసింది. కాగా, గత ఏడాది మే నెలలో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa