మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఎన్సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఒకవైపు.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉండగా.. మరోవైపు.. పార్టీలోని కీలక నేతలు కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచనలంగా మారింది.
సునేత్రా పవార్ ( అజిత్ పవార్ భార్య)
అజిత్ పవార్ తర్వాత పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఆయన భార్య సునేత్రా పవార్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్రా పవార్.. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.
పార్థ్ పవార్ ( అజిత్ పవార్ కుమారుడు)
అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్లో పార్థ్ పవార్కు మంచి గుర్తింపు ఉంది.
ప్రఫుల్ పటేల్
ఎన్సీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన ప్రఫుల్ పటేల్కు.. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
సునీల్ తట్కరే
ప్రస్తుతం ఎన్సీపీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ తట్కరే.. క్షేత్రస్థాయిలో కేడర్పై గట్టి పట్టు ఉంది. కొంకణ్ ప్రాంతంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన సునీల్ తట్కరే.. ఎన్సీపీ యంత్రాంగాన్ని నడిపించడంలో అజిత్ పవార్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవారు.
బలమైన ప్రాంతీయ నేతలు
ఛగన్ భుజబల్
మహారాష్ట్ర బలమైన ఒబీసీ నాయకుడిగా ఉన్న ఛగన్ భుజబల్.. అజిత్ పవార్ వర్గంలో అత్యంత సీనియర్ మంత్రిగా ఉన్నారు. పార్టీ సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలంటే ఛగన్ భుజబల్ పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే వయస్సు రీత్యా ఆయన నేరుగా పార్టీ పగ్గాలు చేపట్టడం కంటే మార్గదర్శకుడిగా ఉండే అవకాశం ఉంది.
ధనంజయ్ ముండే
అజిత్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.
ఎన్సీపీ ముందు రెండు ఆప్షన్లు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్సీపీ రెండు మార్గాల్లో పయనించే అవకాశం ఉంది. అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేయడం కష్టమని భావిస్తే.. తిరిగి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్)లో విలీనం కావడం. దీనివల్ల పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటి కానుంది. లేని పక్షంలో సునేత్రా పవార్ను అధ్యక్షురాలిని చేసి.. ప్రఫుల్ పటేల్ లేదా సునీల్ తట్కరేలకు కీలక బాధ్యతలు అప్పగించడం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa