ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆమె లోక్సభలో ప్రసంగిస్తూ, సామాన్యులు కూడా ఫైల్ చేసేలా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసినట్లు చెప్పారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగిసిందని, దీనిని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విదేశీ విద్య, వైద్యంపై టీడీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.మానవ వనరుల సరఫరా సంస్థలపై కూడా టీడీఎస్ తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ ఏజెన్సీలపై 1 లేదా 2 శాతం టీడీఎస్ వర్తిస్తుందని అన్నారు. రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్నును తొలగిస్తున్నామని అన్నారు. చిన్న మొత్తంలో పన్ను చెల్లింపులు జరిపే వారికి కూడా ప్రత్యేక పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు.ఇక నుంచి విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్పష్టం చేశారు. అదే సమయంలో కంపెనీల బైబ్యాక్ విధానాలకు కేంద్ర ఆర్థిక మంత్రి షాకిచ్చారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 2 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు. నాన్-కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రతను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇలాంటి వివాదాల్లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, జరిమానా చెల్లిస్తే కనుక ఆ జైలు శిక్ష నుంచి కూడా మినహాయింపు ఉండనుందని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa