ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా శివరాత్రి వేళ ..... అరుణాచలం తరహాలో భక్తులకు అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 08:26 PM

మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తితో పాటుగా సామాజిక ప్రయోజనం కూడా చేకూరేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహా శివరాత్రి పండుగ తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో రూ. 10 కోట్లు ఖర్చు చేసి సిమెంట్ రోడ్డు నిర్మించిన సంగతిని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 22 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదక్షిణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మార్గంలో.. ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి కైలాసగిరిప్రదక్షిణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని కోరుకున్నారు.


మరోవైపు పది కోట్లు ఖర్చు చేసి నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ రోడ్డును పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఆలయాల్లో పాలకమండళ్లు బాధ్యతగా వ్యవహరిస్తే.. అపచారాలు జరగవని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందన్నారు. వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని.. అప్పటి పాలక మండలి బాధ్యతగా పనిచేసి ఉంటే తప్పులు జరిగేవి కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన కొత్త పాలక మండళ్లు.. ఎలాంటి తప్పులు, అపచారాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రూ. 40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. దేవాదాయశాఖ సహకారంతో ఏలూరు జిల్లాలోని ఐ.ఎస్. జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కోటప్పకొండ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేశామని తెలిపారు.


పంచాయతీరాజ్ శాఖ, ఉపాధి హామీ పథకం, సాస్కీ నిధులు కలిపి రూ. 40 కోట్ల వరకూ ఖర్చు చేసి 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం తరహాలో ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa