సీఎం పర్యటనపై అధికారుల కసరత్తు.

షేర్ చేయండి:
కొర్రపాడు, సిద్దరాంపురంలో హెలి ప్యాడ్ కోసం స్థల పరిశీలన
 
బుక్కరాయ సముద్రం మేజర్ న్యూస్ :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 22న అనంతపురం జిల్లాలో పర్యటించే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్‌, జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ సోమవారం బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించారు.కొర్రపాడు గ్రామంలోని డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. అనంతరం సిద్దరాంపురం గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల, పరిసర ప్రాంతాలతో పాటు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా సభ నిర్వహణకు అనువైన స్థలాలు, హెలీప్యాడ్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.
స్వచ్ఛతపై ప్రత్యేక ఆరా
కొర్రపాడు, సిద్దరాంపురం గ్రామాల జనాభా, ఇళ్ల సంఖ్య, పంచాయతీల్లోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు, స్వచ్ఛ రథాలు, రోజువారీ చెత్త సేకరణ, కమ్యూనిటీ సోక్‌పిట్లు, మ్యాజిక్‌ డ్రైన్లు, కంపోస్ట్‌ పిట్లు, కిచెన్‌ గార్డెన్లు తదితర వివరాలను కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద చేపడుతున్న క్లీనింగ్‌ యాక్టివిటీలపైనా ఆరా తీశారు.
అందుబాటులో ఉన్న భూములపై వివరాలు
సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల కోసం ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఎంత? హెలీప్యాడ్‌, సభా కార్యక్రమాలకు ఎంత విస్తీర్ణం అవసరం? తదితర అంశాలపై కలెక్టర్‌, ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన జియో కోఆర్డినేట్స్‌, సరిహద్దులు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీపీవో నాగరాజు నాయుడు, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీవో సాల్మన్‌,సీఐ సుబ్బరాయుడు,యస్ ఐ ఆంజనేయులు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సునీతతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.