ఓటీటీకి 'జననాయగన్'

షేర్ చేయండి:

విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. విజయ్ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన మొదటి సినిమాగా రూపొందిన 'జన నాయగన్' సినిమాపై విడుదలకి ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనీ, రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతుందనడంలో సందేహం లేదని చెప్పుకున్నారు. విడుదల తరువాత ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వెళ్లింది. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, వినోత్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. పూజ హెగ్డే - మమితా బైజు కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమాను తమిళంతో పాటు, తెలుగు .. మలయాళ.. కన్నడ .. హిందీ  భాషల్లోను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ప్రకటించారు.

'వెట్రి' కొన్ని కారణాల వలన జైలు జీవితాన్ని అనుభవిస్తాడు. క్షమా భిక్ష కారణంగా బయటికి వస్తాడు. జైలులో ఉన్నప్పుడు అక్కడి అధికారితో అతనికి పరిచయమవుతుంది. ఆ అధికారి హఠాత్తుగా చనిపోవడంతో, ఆయన కూతురు 'విజ్జి' ఒంటరి అవుతుంది. దాంతో వెట్రి ఆమెను చేరదీస్తాడు. అయితే ఆమెను అంతం చేయడానికి 'హిమ్లర్' తన గ్యాంగ్ ను రంగంలోకి దింపుతాడు. హిమ్లర్ ఎవరు? ఆయన విజ్జీని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఆయన బారి నుంచి విజ్జీని కాపాడటం కోసం వెట్రి ఏం చేస్తాడు? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి మరి.