రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ.

షేర్ చేయండి:

కళ్యాణదుర్గం టౌన్ మేజర్ న్యూస్ :అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు. వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడి కుమార్తె వైద్యానికి సైతం స్పందించి సహాయం అందించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అనారోగ్యంతో బాధపడుతున్న పవిత్ర.

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడి కుమార్తె పవిత్ర కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చును భరించే స్థోమత కుటుంబానికి ఇబ్బందిగా మారింది. ఈ విషయం గ్రామస్థులు, కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి వెళ్లింది.

హామీ ఇచ్చిన వెంటనే చర్యలు.

పవిత్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, వైద్యం కోసం అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. హామీ ఇచ్చిన మూడు రోజుల్లోనే రూ.3,50,000 విలువైన ఎల్ఓసీ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు.

అమరావతిలో కుటుంబ సభ్యులకు అందజేత.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ఓసీ పత్రాలను సోమవారం అమరావతిలోని అసెంబ్లీ వద్ద పవిత్ర కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. అవసరమైతే భవిష్యత్తులోనూ తన వంతు సహకారం అందిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ప్రజల సమస్యలు, ఆపద సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో స్పందించడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడి కుటుంబానికి చెందిన యువతి వైద్యానికి సైతం చొరవ తీసుకుని సీఎం సహాయనిధి అందేలా చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి బలం చేకూర్చింది.

పవిత్రకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.3.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయించడంపై కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో పవిత్రకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.