గాంధీ, నెహ్రూపైనా కేసులు పెట్టండి
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందేమాతరం వివాదంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నించారు. తాము పాడిన వందేమాతరం కొత్తది కాదని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ పాడినదే తామూ పాడామని స్పష్టం చేశారు. అది నేరమైతే వారిపైనా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై వివాదం మొదలైంది. ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత వందేమాతరం ఆలపించారు. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం తొలి రెండు చరణాలతో ముగించాల్సిన గేయాన్ని పూర్తిగా ఆలపించారు. గాయకులు కొనసాగించడాన్ని సోనియా గాంధీ గమనించి వారిని ఆపేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. వందేమాతరం ఆలాపనను అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పాడుతున్న వందేమాతరం గీతాన్నే తాజాగా కూడా ఆలపించామని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే గేయాన్ని ఆలపించిందని గుర్తుచేశారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడో తీర్మానం చేసిందని ఖర్గే తెలిపారు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వస్తే, వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది అందరూ పాటించాలా? అని ప్రశ్నించారు.
