కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ఏపీ జితేందర్ రెడ్డి భేటీ

షేర్ చేయండి:

హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదం తెలపాలని వినతి 
కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ 
ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లు 
వాటితో సమానంగా దీనికి ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని సూచన 

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు  ఏపీ జితేందర్ రెడ్డి నేడు న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. ఈ సమావేశంలో ఏపీ జితేందర్ రెడ్డి వెంట ఖమ్మం ఎంపీ  ఆర్. రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ  బలరాం నాయక్ ఉన్నారు. హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌గా అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లతో సమానంగా దీనికి ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని కోరారు. దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో డజనుకు పైగా ప్రధాన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక డీఆర్‌డీఓ ప్రయోగశాలలతోపాటు 1,500కు పైగా ఏరోస్పేస్, రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు 100 శాతం వృద్ధి నమోదు చేశాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత కారిడార్‌తో స్వదేశీ రక్షణ ఉత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు వేగవంతమవుతాయని జితేందర్ రెడ్డి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యాభివృద్ధికి ఇది దోహదపడటంతోపాటు దేశ రక్షణ సన్నద్ధతకు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గణనీయమైన తోడ్పాటునందిస్తుందని వివరించారు. ఈ విజ్ఞప్తిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనను తగిన విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.