telanagana
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయమని కోరితే.. సస్పెండ్ చేస్తారా ?
- ఉపాధ్యాయులపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు నియంతృత్వ ధోరణికి నిదర్శనం
- కూటమి ప్రభుత్వంపై వైసిపి పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి విమర్శ
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీదే కాకుండా.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పై సైతం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ నియంతృత్వ ధోరణికి పాల్బడుతున్నారని వైఎస్సార్సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలో వైసిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.అశోక్ కుమార్ రెడ్డిని, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ నాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు అమర్నాథ్ రెడ్డి, కడప జిల్లా ఎస్టియు నాయకులు సంగమేశ్వర్ రెడ్డిని నిష్కారణంగా సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)ను రద్దు చేయాలని ఢిల్లీలో ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించడమే తప్పుగా భావించి సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. టెట్ రద్దు చేయాలని కోరితే.. డీఎస్సీపై ఫిర్యాదు చేశారని తప్పుడు ఆరోపణ చేసి చర్యలు తీసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. డీఎస్సీపై ఫిర్యాదు చేసినట్లు ఏ విధమైన ఆధారం లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించి అశోక్ కుమార్ రెడ్డి మరియు ఇతర నాయకుల పై చర్యలు తీసుకున్నారన్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ ..ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. టెట్ అర్హతను మినహాయింపు ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులను కాపాడాల్సిన ప్రభుత్వం.. ఇబ్బందులకు గురిచేస్తోంటే.. వైఎస్సార్ టి ఎ మరియు ఇతర సంఘ నాయకులు విన్నవించడం నేరంగా భావిస్తున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత సంకుచిత మనస్తత్వంతో ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఎద్దేవా చేశారు. వైఎస్సార్టీఏ నాయకులపై మంత్రి లోకేష్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేంద్ర మంత్రిని కలిస్తే నీకు ఉలుకెందుకని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అనే చందంగా లోకేష్ వైఖరి ఉందన్నారు.కనీసం నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న కడప జిల్లా ఓపెన్ స్కూల్ మాజీ కోఆర్డినేటర్ సాంబశివా రెడ్డి, రాయచోటికి చెందిన శ్రీనివాస రాజు, ఎస్ఎస్ఏ సీఎంఓ చంద్రశేఖర్ లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
