భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

షేర్ చేయండి:

పత్రికా ప్రకటన

 

భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

విద్యుత్‌ సరఫరా నాణ్యత, లోడ్‌ నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు

టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ జితేష్‌ వి. పాటిల్‌, ఐఏఎస్ మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఖుష్బూ గుప్తాతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ పనితీరు, విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, వినియోగదారులకు అందుతున్న సేవలపై సీఎండీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సబ్‌స్టేషన్‌పై ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ లోడ్‌, గరిష్ట డిమాండ్‌ సమయంలో తీసుకుంటున్న చర్యలు, విద్యుత్‌ సరఫరా స్థితిగతులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్న సామర్థ్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా సబ్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందో, ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై వివరాలు సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సబ్‌స్టేషన్లు మరియు ఫీడర్ల పనితీరును నిరంతరం సమీక్షించాలని సీఎండీ ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ మరియు సురక్షిత విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, లోడ్‌ వివరాలు, సాంకేతిక సమస్యలు, భవిష్యత్‌ అవసరాలు మరియు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సీఎండీకి వివరించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న చర్యలపై కూడా చర్చించారు.

ఈ తనిఖీలో టీజీఎస్పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ భీమనాయక్, డివిజనల్‌ ఇంజనీర్‌ చంద్రమౌళి, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.