తెలంగాణకు నో ప్లేస్!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురికి కీలక బాధ్యతలు దక్కాయి. డి. పురందేశ్వరి, రామ్ మాధవ్కు జాతీయ ఉపాధ్యక్ష పదవులు వరించాయి. విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా జాతీయ టీమ్లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్త కార్యవర్గంలో కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఒడిశాకు చెందిన బైజయంత్ పాండా, ఉత్తరప్రదేశ్కు చెందిన రేఖా వర్మ, తారిఖ్ మన్సూర్ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగనున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, పంజాబ్కు చెందిన మన్ప్రీత్ సింగ్ బాదల్ సహా పలువురికి ఇదే బాధ్యతలు అప్పగించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమెకు లభించిన తొలి కీలక సంస్థాగత బాధ్యత ఇదే. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్ సహా పలువురు ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. వసుంధర రాజే, స్మృతి ఇరానీ మళ్లీ కీలక సంస్థాగత పదవుల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా కొనసాగనున్నారు. శివప్రకాశ్, సౌదాన్ సింగ్ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత)గా బాధ్యతలు చేపట్టనున్నారు. పీయూష్ గోయల్కు జాతీయ కోశాధికారి పదవి ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా సంబిత్ పాత్రను నియమించారు. పార్టీ మీడియా వ్యవహారాలను అనిల్ బలూనీ చూసుకోనున్నారు. తెలంగాణకు మాత్రం ఈసారి జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. గతంలో డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహించారు. కొత్త టీమ్లో ఇద్దరికీ చోటు దక్కలేదు. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే తదుపరి లక్ష్యమని బీజేపీ చెబుతున్న సమయంలో.. జాతీయ స్థాయి పదవుల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
