రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
తెలంగాణలో పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నేరుగా, మరుగున దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 3,245 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ పారిశ్రామిక నగర రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్లు ఢిల్లీ నుంచి నిర్వహించిన 'నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్' సమీక్షా సమావేశంలో సచివాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పద్ధతిలో వేగవంతంగా పూర్తి చేస్తున్నామని, 2028 మార్చి నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు.
ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భూకేటాయింపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 51 శాతం భాగస్వామ్యం వహిస్తుండగా, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా 'ప్లగ్ అండ్ ప్లే' వసతులను సత్వరమే కల్పిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) పథకంలో భాగంగా కేంద్రం ప్రారంభించనున్న 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులలో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని పీయూష్ గోయెల్కు శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు.
