ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గజగజ వణికిస్తున్న లంపీ వైరస్...ఇప్పటి వరకు 67వేల పశువుల మరణం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 11:18 PM

కరోనా వైరస్ ఛాయలు పూర్తిగా తొలిగిపోకముందే మనదేశంలో లంపీ వైరస్ వేదన మొదలైంది. దీంతో ఎపుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనను పశుపెంపకందార్లు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా మన దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి పెరిగిందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 67 వేల పశువులు చనిపోయాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది. సుమారు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


లంపీ స్కిన్ డిసీజ్ కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా రాష్ట్రాల్లో ‘గోట్ పాక్స్’ వ్యాక్సిన్ ను పశువులకు ఇస్తున్నారని కేంద్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ సెక్రెటరీ జతింద్రనాథ్ తెలిపారు. ప్రత్యేకంగా లంపీ స్కిన్ డిసీజ్ కోసం జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ‘లంపీ ప్రోవాక్ ఇండ్ (ఎల్ఎస్ డీ)’ను రూపొందించినట్టు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు వివరించారు.


ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్ లలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని జతింద్రనాథ్ తెలిపారు. రాజస్థాన్ లో అయితే రోజుకు ఆరేడు వందల పశువులు చనిపోతున్నట్టు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రోజుకు వంద, రెండు వందల పశువులు చనిపోతున్నట్టు వివరించారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ లంపీ వైరస్ పై సమర్థవంతంగానే పనిచేస్తోందని.. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల పశువులకు ఈ వ్యాక్సిన్ వేశారని వెల్లడించారు. ఇదిలావుంటే ప్రస్తుతం లంపీ స్కిన్ డిసీజ్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఒకట్రెండు లంపీ వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖల అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa