ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్యోగాల్లో స్థానికులకే 75శాతం రిజర్వేషన్: జార్ఖండ్ సీఎం నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 12:43 AM

ఉద్యోగాల్లో 75 శాతం తప్పనిసరిగా స్థానికులకు అవకాశం ఇవ్వాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. అయితే, వీటికి కొన్ని పరిమితులు కూడా విధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని చట్టం చేసింది. తాజాగా స్థానికులకు పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది.


యువకులకు ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయితే, స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన అంశం సాధ్యాసాధ్యాలపై నిపుణులు, పారిశ్రామిక వర్గాలు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏ పరిశ్రమ స్థాపించినా.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. దీనివల్ల నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. దేశవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఎక్కడున్నా సరే వారిని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారు. తమ ఉత్సాదనకు వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రైవేట్ సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపరు అనే వాదన ఉంది.


ఇక ఈ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరి వాదన. చట్టం అమల్లో చాలా రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని.. అంతిమంగా ఇది పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగిస్తుందనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. ఈ విధానంపై మరింత క్లారిటీ ఇచ్చారు. కొన్ని పరిమితులను కల్పించారు.


నెలవారీ వేతనం రూ.40 వేల లోపు గల ఉద్యోగుల విషయంలోనే ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలి. రూ.40 వేలు, అంతకంటే ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న కంపెనీలు వచ్చే మూడేళ్లలో క్రమంగా ఈ లక్ష్యాన్ని అందుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది. కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్, లేబర్ కమిషనర్, ఇండస్ట్రీ డైరెక్టర్, చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్‌స్పెక్టర్ సహా మరికొంత మంది ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. వాస్తవానికి దీనికి సంబంధించిన ఉత్తర్వులను జులై 29వ తేదీనే జారీ చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 20) మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సోరెన్ దీనిపై సమీక్ష నిర్వహించారు. అమలు చేసే అంశానికి సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. జగన్ సర్కార్ బాటలో జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే 4 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రాంచీని రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని మరో 3 నగరాలను సబ్-క్యాపిటల్స్‌గా ఏర్పాటు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa