ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాలకు కేంద్రం షాక్ సొంత మీడియాలొద్దు డిడి ద్వారానే ప్రసారం

national |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 10:50 AM

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసిన విషయం జగమెరిగిన సత్యం. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ఛానెల్స్, పత్రికలు పెట్టేసుకున్నాయి. యిలాంటి వారు సొంత డబ్బా కొట్టుకోవడం కోసమే దుర్వినియోగం అవుతున్నాయని, గ్రహించిన కేంద్రం వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై సొంతంగా మీడియా ఛానళ్లను ప్రారంభించే వీలు లేకుండా చర్యలకు సిద్ధం అయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న ఛానళ్లు కూడా తమ కంటెంట్ ను ప్రసారభారతి దూరదర్శన్ లోనే ప్రసారం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.


దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ఛానళ్ల ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలాగే ఇప్పటికే సొంతంగా మీడియా ఛానళ్లు నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఎదురుదెబ్బ తగలనుంది. రాష్ట్రప్రభుత్వాలు నడుపుతున్న మీడియా ఛానళ్ల కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య తలెత్తుతోందని ట్రాయ్ భావిస్తోంది. దీంతో ట్రాయ్ సూచనల మేరకు వీటిని నియంత్రించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం.


కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాల మంత్రిత్వ శాఖ లేదా శాఖలు, వాటి అనుబంధ సంస్థలు భవిష్యత్తులో ప్రసార కార్యకలాపాలను ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడంలో ప్రవేశించకూడదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచించింది. ప్రసారానికి సంబంధించిన అన్ని విషయాలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీ అని పేర్కొంటూ, పోస్ట్లు, టెలిగ్రాఫ్లు, టెలిఫోన్లు, వైర్స్, బ్రాడ్కాస్టింగ్, ఇతర రకాల కమ్యూనికేషన్లు, లైసెన్స్లను మంజూరు చేయడానికి ప్రత్యేక హక్కు కల్పించే అధికారం కేంద్రానికే ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే తమ కంటెంట్ను ప్రసారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాచారాన్ని ప్రసార భారతి ద్వారా దీన్ని కొనసాగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇలా తమ కంటెంట్ ను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసుకునేందుకు వచ్చే ఏడాది డిసెంబర్ 23 వరకూ కేంద్రం గడువు పెట్టినట్లు తెలిసింది. దీంతో పలు రాష్ట్రాల్లో సొంత ఛానళ్ల ద్వారా కంటెంట్ ప్రసారం చేసుకుంటున్న ప్రభుత్వాలు వచ్చే ఏడాది లోగా డీడీకి మారాల్సి ఉంటుంది. అప్పుడు తమ సొంత ఛానళ్లను మూసేయాల్సి ఉంటుంది.


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు, న్యాయ శాఖ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేసినట్లు కేంద్రం పేర్కొంది.కేంద్రం తీసుకున్న నిర్ణయం పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఏపీ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలపై దీని ప్రభావం పడబోతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐపీటీపీని నడుపుతుండగా, తమిళనాడులో కల్వీ టీవీ, అరసు కేబుల్ కూడా నడుపుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఇవి మూతపడాల్సి రావొచ్చని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa