మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు గీత కార్మికుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన కల్లుగీత పాలసీతో గీతకార్మికులకు ఒరిగేదేమీలేదని విమర్శించారు. అనారోగ్యానికి కారణమయ్యే మద్యం అమ్మకాలకు వీధికో దుకాణానికి పర్మిషన్ ఇచ్చి, కల్లు దుకాణాల ఏర్పాటుకు మాత్రం నిబంధనల పేరుతో ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా కల్లు గీత కార్మికులు ఉండగా.. 95 వేల మంది మాత్రమే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు గీశారంటూ గీత కార్మికులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు.
రాష్ట్రంలో 4 వేలకు పైగా ఉన్న కల్లు దుకాణాలను తగ్గించేందుకు నూతన కల్లుగీత పాలసీలో కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరా పరిశ్రమ ఏర్పాటు డిమాండ్ ను కూడా పాలసీలో పెట్టలేదని చెప్పారు. గీతకార్మికుల కన్నా మద్యం అమ్మకాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యమనే విషయం ఈ పాలసీతో తేలిపోయిందన్నారు. గీత కార్మిక సంఘాలు, కార్మికులతో చర్చించకుండా పాలసీని ఏకపక్షంగా ప్రకటించడమేంటని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సత్యప్రసాద్ నిలదీశారు. పొరుగు రాష్ట్రంలో గీత కార్మికులను ప్రోత్సహించేందుకు మద్యం దుకాణాల కేటాయింపులో 15 శాతం కేటాయిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం గీత కార్మికులను వృత్తికి దూరంచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఒక షాపు ఉండాలనే నిబంధన ఏ విధంగా పెడతారని ఎమ్మెల్యే సత్యప్రసాద్ ప్రశ్నించారు.
‘గీసేవానికే చెట్టు’ అనే పథకం టీడీపీ ప్రవేశపెడితే, ‘దోచుకోవడానికే పాలసీ’ అనే విధంగా జగన్ ప్రభుత్వం మారిందనీ, ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికులకు పరిహారం టీడీపీ ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 47 మంది గీత కార్మికులు మరణిస్తే.. అందులో 10శాతం మందికి కూడా ప్రభుత్వం సాయం చేయలేదనేది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో వేలాది ఈత, తాటి చెట్లను నరికేసిన ప్రభుత్వం.. ఆయా చెట్లు సమృద్ధిగా పెరగడానికి చర్యలు తీసుకుంటామని పాలసీలో పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. బలహీనవర్గాలపై కక్ష సాధించేలా ఉన్న ఈ పాలసీని రద్దు చేసి, గీత కార్మికుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త పాలసీని రూపొందించాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa