ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కువ ప్రీమియంతో పెద్ద పాలసీ...తీసుకొొచ్చిన పోస్టల్ శాఖ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 10:35 PM

మనం ఎంత పెద్ద పాలసీ  కడితే దాని ప్రీమియం కూడా అంతే స్థాయిలో చెల్లించాల్సి  ఉంటుంది. కానీ తాజాగా పోస్టల్ శాఖ కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొొచ్చింది. పాలసీ విలువ పెద్దదైనా ప్రీమియం మాత్రం చాలా తక్కువే.  ఇదిలావుంటే కరోనా ప్రభావంతో ఆరోగ్య భీమా ఆవశ్యకత చాలామందికి తెలిసొచ్చింది. తగిన పాలసీని ఎంచుకుని తమ కుటుంబానికి బీమా చేయిస్తున్నారు. అయితే, ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉండడంతో ఇప్పటికీ కొందరు ఆరోగ్య బీమాకు దూరంగానే ఉంటున్నారు. అలాంటివారి కోసమే ఈ పోస్టాఫీసు ప్రమాద బీమా పథకం.. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాన్ని ఈ స్కీంలో పొందవచ్చు. ఏటా రూ. 299, లేదా రూ. 399ల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందని పోస్టల్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ప్రమాదం ఎలాంటిదైనా ఈ పథకం కింద బీమా వర్తిస్తుందని వివరించారు. టాటా ఏఐజీ సంస్థతో కలిసి ఈ బీమా పథకాన్ని పోస్టల్ శాఖ తన వినియోగదారులకు అందజేస్తోంది. వయసు 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతా తెరవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ రెండు పథకాలకు సంబంధించి మరిన్ని వివరాలకు దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించాలని అధికారులు సూచించారు.


రూ. 399 ప్రీమియంతో..


ఏటా రూ. 399 ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకుంటే.. ఏదైనా ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం కలిగినా, ప్రమాదంలో అవయవం తొలగించినా, పక్షవాతం బారిన పడినా.. పరిహారం కింద బీమా కంపెనీ రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. మరణించిన సందర్భంలో పాలసీదారుడి అంత్యక్రియల కోసం రూ. 5 వేలు తక్షణ అవసరాల కోసం అందజేస్తుంది. పాలసీదారుడి పిల్లల చదువులకు రూ. లక్ష పరిహారం చెల్లిస్తుంది. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరితే.. ఖర్చుల కోసం రూ. 60 వేలు, ఔట్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటే రూ. 30 వేలు అందజేస్తుంది. ఇన్ పేషెంట్ గా ఉన్నపుడు మొదటి 10 రోజుల వరకు రోజూ రూ. వెయ్యి చొప్పున బెడ్ చార్జీలనూ చెల్లిస్తుంది.


రూ. 299 ప్రీమియంతో..


ఈ ప్రమాద రక్షణ బీమా కింద శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం కలిగినా, పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షల వరకు బీమా కంపెనీ అందజేస్తుంది. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరితే.. ఖర్చుల కోసం రూ. 60 వేలు, ఔట్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటే రూ. 30 వేలు అందజేస్తుంది. అంత్యక్రియల ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చు, బెడ్ ఖర్చుల వంటివి ఈ పథకంలో ఉండవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa