తాడిపత్ర మున్సిపల్ ఛైర్మన్ జే.సీ.ప్రభాకర్ రెడ్డిపై జిల్లా ఎస్పీకి తాడిపత్రి వాసి ఫిర్యాదు చేశాడు. పన్నెండేళ్లుగా తన షాపును ట్రావెల్స్ కోసం వాడుకుంటూ ఒక్క రూపాయి కూడా అద్దె ఇవ్వలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి ఆరోపణలు గుప్పించారు. అద్దె అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. తన షాపును తనకు అప్పగించాలని జిల్లా ఎస్పీ ఫకీరప్పకు మంగళవారం ఆయన మొరపెట్టుకున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సదరు షాపు యజమాని మల్లికార్జున ఆచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలిసిన మల్లికార్జున దంపతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
అనంతపురంలోని సుభాష్ రోడ్డులో స్థానిక నందిని హోటల్ ఎదురుగా మల్లికార్జున్ ఆచారికి సర్వే నెంబర్ 15/144 లో ఓ దుకాణం ఉంది. 2000 సంవత్సరంలో ఈ షాపును బాబయ్య అనే వ్యక్తికి మల్లికార్జున అద్దెకు ఇచ్చారు. 2010లో బాబయ్య ఆ షాపును జేసీ ట్రావెల్స్ కు ఇచ్చారు. అప్పటి నుంచి జేసీ ట్రావెల్స్ వాళ్లు తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని మల్లికార్జున చెప్పారు. మల్లికార్జున దంపతులు నగరంలోని పాతూరులో నివసిస్తున్నారు.
అద్దె చెల్లించకపోవడంతో షాపును ఖాళీ చేయాలని కోరగా బెదిరింపులకు దిగుతున్నారని మల్లికార్జున ఆరోపించారు. తన కుమారులు ఇద్దరూ నిరుద్యోగులేనని, వారితో ఏదైనా వ్యాపారం పెట్టించాలనే ఉద్దేశంతో షాపు ఖాళీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. షాపును ఖాళీ చేయించి తనకు అప్పగించాలని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa