తమ జీతాలు పెంచాలని కోరుతూ ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. 60 వేల మంది అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ పోరు రెండు రోజులుగా సాగుతుంది. తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన బాటపట్టారు.
రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు అసెంబ్లీ ముందు ధర్నాకు చేస్తున్నారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వారి ఆందోళనను ఉధృతం చేశారు. ఇంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టడంతో దాదాపుగా 60 వేల అంగన్వాడీలు మూతబడ్డాయి.
జీతం పెంచాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన డిమాండ్. నెలకు రూ.18 వేలు, సహాయకులకు నెలకు రూ.9 వేలు వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలాగే నెలకు రూ.5 వేల పెన్షన్, విధుల్లో ఉండగా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు ధర్నాను విరమించేది లేదని అంగన్వాడీల అధ్యక్షురాలు సుమిత్రా మొహపాత్ర తెలియజేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విన్న వించాం అని, వందకుపైగా ఉత్తరాలు రాశామని అంగన్వాడీ కార్యకర్తలు వెల్లడించారు. వాటిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించ లేదని, పైగా తమపై మరింత పని భారాన్ని మోపిందని విమర్శించారు. అందుకే ప్రభుత్వానికి ముందుగా తెలియజేసే, 15 రోజుల నోటీసు ఇచ్చి ధర్నాకు దిగామని అఖిల భారతీయ అంగన్వాడీ మహా సంఘం సెక్రటరీ అంజలి పటేల్ చెప్పారు. కాగా ప్రస్తుతం బీహార్లో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 7,500లు మాత్రమే వేతనం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa